రాష్ట్రానికి 6 సూత్రాలు
కలిసి ఉంటే కలదు సుఖం ఆనందమయ రాష్ట్రానికి 6 సూత్రాలు
హైదరాబాద్, మేజర్న్యూస్: పది నెలల పాటు రాష్టమ్రంతటా పర్యటించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఎన్ని పేజీల నివేదిక ఇచ్చినా చిట్ట చివరకు రాష్ట్ర విభజన అనవసరం తేల్చింది. తాను చేసిన ఐదు సిఫారసులలో మూడు పరిశీలనార్హం కావని ముందుగానే ఒప్పుకున్న కమిటీ ఆరవ సిఫారసులో అటూ ఇటూ తిప్పి రాష్ట్రాన్ని విభజించాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. ఈ సిఫారసులో ఏమన్నదంటే...
‘తెలంగాణ ప్రాంతానికి సామాజిక, ఆర్థిక అభివృద్ధి, రాజ కీయ సాధికారత కలిగించటం, చట్టబద్ధమైన అధికారాలు కలిగిన తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయటం ద్వారా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచవచ్చు...’ ఈ సిఫారసును అమలు చేయటం ద్వారా...జాతీయ పరిస్థితు లను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం సమైక్య ఆంధ్రప్రదేశ్ను కొనసాగించాలన్న సిఫారసు చేస్తున్నామని కమిటీయే స్పష్టంగా చెప్పింది. దృఢమైన రాజకీయ, పాలనా దక్షతల ద్వారా రాష్ట్రంలో మెజారిటీ ప్రజానీకాన్ని మెప్పించగలిగిన సిఫారసు అని పేర్కొన్నది. అంటే శాంతి భధ్రతలఅంశం తలెత్తితే కఠినంగా వ్యవహరించటం ద్వారా కాపాడవచ్చునని, అన్ని ప్రాంతాల నేతలను ఏదో ఒక రకంగా బుజ్జగించటం ద్వారా పాలనా దక్షతను చాటుకోవచ్చునని చెప్పిందన్న మాట.
అలాగే విద్య, పారిశ్రామిక, ఐటీ రంగాలలో నానాటికీ అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరం విషయంలో మిగిలిన ప్రాంతాలలో ఉన్న సందిగ్ధతను తొలగించ వచ్చునని చెప్పింది. మూడు ప్రాంతాలకూ సమానంగా నీరు, నీటి పారుదల యాజమాన్యాన్ని అందించటం కోసం ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలన్నది. నీటి పారుదల ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఒక కార్పొరేషన్ను సైతం ఏర్పాటు చేయాలన్నది. ఇవి జరిగితే తెలంగాణ ప్రాంత ప్రజానీకం లేవనెత్తిన అన్ని అంశాలకూ పరిష్కారం లభిస్తుందని చెబుతూ ఈ సిఫారసును అమలు చేస్తే రాష్ట్ర విభజన అవసరమే లేదన్న అభిప్రాయాన్ని ప్రస్ఫుటంగా వ్యక్తం చేసింది. చివరగా ప్రస్తుత పరిస్థితిలో, అన్ని ప్రాంతాల ప్రజానీకం ప్రయోజ నాలను దృష్టిలో ఉంచుకుని ఈ సిఫారసు మాత్రమే చక్కటి పరిష్కార మార్గం అని చెప్పుకున్నది.
తానే అంగీకరించని మూడు...ఇక సిఫారసుల సారాంశం ప్రారంభంలో తానే చెప్పిన మూడు అంశాలు పనికిరావని కమిటీయే పేర్కొన్నది. అవి ఒకటి యథాతథ స్థితిని కొనసాగించటం, రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణగా విభజించి హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి, రెండు రాష్ట్రాలకూ రెండు రాజధానులను ఏర్పాటు చేయటం, రాష్ట్రాన్ని రాయల తెలంగాణ, కోస్తా ఆంధ్రగా విభజించి హైదరాబాద్ను రాయల తెలంగాణలో అంతర్భాగంగా ఏర్పాటు చేయటం... ఈ సిఫారసులపై వివరణ ఇస్తూ...మొదటి దానికి చాలా తక్కువ మంది అంగీకరిస్తారని, రెండవ దానికి అసలు సిఫారసు ఏమాత్రం సాధ్యం కాదని, మూడవ దానికి అసలు సమస్యకు పరిష్కారమే కాదని తానే చెప్పుకున్నది.
తెలంగాణకు న్యాయం జరిగింది...
రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు ముఖ్యమంత్రులుగా ఎక్కువ కాలం ఉన్నప్పటికీ వారికి ప్రధానమైన మంత్రి పదవులు దక్కలేదని పేర్కొన్నది. అలాగే భారీ, మధ్య తరహా, చిన్న నీటి పారుదల శాఖా మంత్రులుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు 20 మంది, కోస్తా ప్రాంతానికి చెందిన వారు 16 మంది, ఆరుగురు రాయలసీమ నుంచి పని చేశారన్నది. ఇలా చెప్పటం ద్వారా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఎక్కువకాలం నీటి పారుదల రంగంలో మంత్రులుగా పని చేసినా అభివృద్ధి జరగలేదని, దానికి తెలంగాణ వారే బాధ్యులంటూ పరోక్షంగా దెప్పి పొడిచింది. ఇక నివేదిక లోకి వెళ్తే కీలకమైన మంత్రి పదవుల విషయంలో తెలంగాణకు ఎలా న్యాయం జరిగిందో ఒక పట్టిక ద్వారా చెప్పుకొచ్చింది. ఇక కీలకమైన హోం, ఆర్థిక, రెవిన్యూ మంత్రులుగా ఉన్న వారిలో ఏ ప్రాంతానికి చెందిన వారు ఎంతకాలం బాధ్యతలు నిర్వహించారో ఒక జాబితా ద్వారా తెలిపింది.
శ్రీకృష్ణ చిట్కాలు
1. యథాతథ స్థితిని కొనసాగించడం
2. తెలంగాణ, సీమాంధ్రలుగా విభజించడం, హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం
3.రాయల తెలంగాణ, కోస్తా ఆంధ్రగా విభజించడం. హైదరాబాద్ను రాయలతెలంగాణలో అంతర్భాగంగా ఉంచడం
4. తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం. మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలను కలిపి హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం. కోస్తా ఆంధ్ర, రాయలసీమతో హైదరాబాద్కు భౌగోళిక సంబంధం కొనసాగించడం
5.హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ. కొత్త రాజధానితో సీమాంధ్ర ఏర్పాటు చేయడం
6.ఆంధ్రప్రదేశ్ను యథాతథంగా ఉంచి తెలంగాణ అభివృద్ధికి రాజ్యాంగ ప్రతిపత్తిగల అభివృద్ధి మండలి ఏర్పాటు చేయడం
Take By: Suryaa.com
Tag: Telangana, Telangana Report, RajNews, eenadu, Sakshi, KCR, AP, NEWS, Imges, Hot Images, Srikrishna Commitee
![Validate my RSS feed [Valid RSS]](valid-rss-rogers.png)














